సినిమా టికెట్ ధరలు ఫ్లెక్సిబుల్ విధానంలో ఉంటేనే చిత్ర పరిశ్రమకు మేలు

• ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించిన ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు, పూర్ణా పిక్చర్స్ ఎండీ శ్రీ గ్రంధి విశ్వనాథ్  

‘తెలుగు చిత్ర పరిశ్రమకు ఓటీటీతోపాటు సినిమా టికెట్ ధరల విషయంలోనూ ఇబ్బందులు ఉన్నాయి. సినిమా టికెట్ ధరల విషయంలో ఫ్లెక్సిబుల్ విధానం తీసుకురావాలి. ఈ విధానం ఇతర రాష్ట్రాల్లో కూడా అమలులో ఉంది. ఈ అంశాన్ని పరిశీలించాల’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు, పూర్ణా పిక్చర్స్ ఎండీ శ్రీ గ్రంధి విశ్వనాథ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో శ్రీ విశ్వనాథ్ భేటీ అయ్యారు. పూర్ణా పిక్చర్స్ శత వసంతాల సావనీర్ ప్రతిని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. 

ఈ సందర్భంగా శ్రీ గ్రంధి విశ్వనాథ్ మాట్లాడుతూ “ఓటీటీలు మాత్రమే కాదు. సినిమా టికెట్ ధరలు ఎక్కువ ఉండటం కూడా సమంజసంగా లేదు అనే భావన కూడా పేద ప్రజలను సినిమాకు దూరం చేస్తోంది. సినిమా రంగాన్ని బతికించడానికి ఫెక్సిబుల్ రేట్ల విధానం తీసుకొస్తే బాగుంటుంది. దీనిపై ఆలోచన చేయాలి. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉంది. కనిష్ఠ, గరిష్ఠ రేట్లను ప్రకటిస్తే సినిమా స్థాయిని బట్టి ఫెక్సిబుల్ రేట్ల విధానంలో ధరలు నిర్ణయించుకుంటారు. చిన్న సినిమాలకు ఈ విధానం వల్ల మంచి కలుగుతుంది. ప్రేక్షకులు కూడా సినిమా హాల్ కు వస్తారు. దీని వల్ల  అన్ని స్థాయిల చిత్రాలకు మేలు కలుగుతుంది” అని వివరించారు. ఈ సూచనలు విన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించి ఈ వివరాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు.

No comments